ఇతర సీజన్ లలో కంటే శీతాకాలంలో చుండ్రు బెడద ఎక్కువ. వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్యత వంటి కారణాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఎక్కువ సమయం ఎసిలో ఉండటం, రోజంతా ఫాన్ గాలికి కూర్చోవటం, తలస్నానం సమయంలో వాడిన షాంపు పూర్తిగా పోకుండా మాడుకు అంటుకోవటం, పోషకాహార లోపం, హార్మోన్ల సమస్యల మూలంగానూ ఈ సమస్య రావచ్చు. చుండ్రు సమస్యకు నేరుగా మందులు వాడటం కంటే ఇంట్లోనే చేసుకునే పదార్థాలను వాడి తగు జాగ్రత్తలు పాటించటం మంచిది. వాటి వివరాలు...
- చుండ్రు బాధితులు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పీచుపదార్థం ఉండేలా చూసుకోవాలి. విటమిన్ -ఎ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. ప్రొటీన్లు ఎక్కువగా గింజలు, కాయగూరలు,చేపలూ తీసుకోవాలి. వేప్పుళ్ళకు మాత్రం దూరంగా ఉండాలి.
- తలస్నానం చేసినప్పుడు శుభ్రంగా తుడుచుకోవాలి. కండిషనర్ వాడిన తర్వాత తలను శుభ్రపరచటంతో బాటు తలస్నానం తర్వాత షాంపూ అవశేషాలు జుట్టు, మాడు మీద లేకుండా చూసుకోవాలి.
- తలకు ఎండ, గాలి తగలకుండా కప్పి వుంచకూడదు. పొడి చర్మం ఉన్నవారు అవసరాన్నిబట్టి తగిన మాయిశ్చరైజర్, షాంపూ, హెర్బల్ కండిషనర్ ఎంపిక చేసుకొని వాడాలి.
- షాంపూతో తలస్నానం చేశాక 6 చెంచాల నీటిలో 3 చెంచాల వెనిగర్ కలిపి తలకు పట్టించాలి. వారానికోసారి, 3 నెలలు ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది.
- తలస్నానానికి అరగంట ముందు పులిసిన పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు వదిలిపోతుంది.
- ఉసిరిలోని ఐరన్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది గనుక నిమ్మరసంలో ఉసిరి రసం లేదా ఉసిరి పొడి కలిపి తలకు బాగా పట్టించి మర్ధన చేసి ఓ గంట తర్వాత స్నానం చేయాలి.
- 4 గోరువెచ్చటి కొబ్బరినూనెలో 2 చెంచాల నిమ్మరసం కలిపి తలకు పట్టించి అరగంట పాటు మర్దన చేసి వేడినీటిలో ముంచిన తువ్వాలు తలకు చుట్టి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు వదిలిపోతుంది. వారానికి 2 సార్లయినా ఇలా చేయాలి.
- మెంతులు నానబెట్టి రుబ్బి తలకు పట్టించి మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే ఎంతటి చుండ్రయినా వదిలిపోతుంది.