దక్కన్ ప్రాంతపు మాంసాహార విందుల్లో తప్పనిసరిగా ఉండే వంటకాల్లో మటన్ ఖీమా ఒకటి. రుచిలోనే గాక పోషకాల పరంగానూ మేలైన వంటకమిది. దాని తయారీ వివరాలు..
కావలసినవి
మటన్ ఖీమా - 250 గ్రాములు, టమోటాలు - 3, ఉల్లిపాయలు - 2, గరం మసాలా - 1 చెంచా, అల్లం, వెల్లుల్లి మిశ్రమం- 2 చెంచాలు, కరివేపాకు - 2 రెబ్బలు, కొత్తిమిర - 2 రెమ్మలు, పసుపు - చిటికెడు, కారం - 1 చెంచా, నూనె - 3 గరిటెలు, ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
నీటిలో ఖీమాను బాగా కడిగి నీరు వార్చి పెట్టుకోవాలి. మూకుడులో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేగిన తర్వాత కరివేపాకు, అల్లం,వెల్లుల్లి మిశ్రమం, పసుపు, కారం వేసి కలిపి 3 నిమిషాలు వేయించాలి. తర్వాత అందులో ఖీమా, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. సన్నని సెగ మీద పెట్టి అందులోని నీరు పూర్తిగా ఇగిరిపోయాక సన్నగా తరిగిన టమాటా, గరం మసాలా పొడి వేసి కలిపి కప్పు నీరు పోసి మెత్తగా ఉడికేవరకు ఉంచాలి. నీరంతా ఇరిగిపోయాక కొత్తిమీర చల్లి దింపుకొంటే వేడి వేడి మటన్ ఖీమా రెడీ.